భారత దేశంలో విలువలకు చాలా విలువుంది. పుట్టిన నేల దగ్గరి నుండి ప్రతి దాన్ని మనం గౌరవిస్తాం. అయితే మామూలుగా విదేశాల్లో మహిళల మీద అలా జరిగింది.. ఇలా జరిగింది అని వార్తలు చదివి.. ఇది భారతదేశం ఖచ్చితంగా అలాంటివి జరగవు అని అనుకుంటున్నాం. కానీ మన వాళ్లే ఆడవాళ్లను లైంగికంగా, బహిరంగంగా, విచ్చలవిడిగా వైధించడం సంచలనం రేపుతోంది. బెంగళూరు సిటీలో న్యూఇయర్ వేడుకల్లో చోటుచేసుకున్న విషాద ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్దరాత్రి పూట ఆడవాళ్ల మీద చేసిన అఘాయిత్యం వెలుగులోకి వస్తోంది. అసలేం జరిగింది అంటే..
డిసెంబర్ 31న అర్థరాత్రి బెంగళూరు ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్లకు యువత తరలివచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేద్దామనుకున్న యువతులు.. నరకాన్ని కళ్లారా చూశారు. 6సాధారణంగా ప్రతిఏటా.. గడియారం గంట కొట్టేందుకు పది క్షణాల ముందు ఆ వీధుల్లో దీపాలన్నీ ఆర్పేస్తారు. పన్నెండు పైకి అన్ని ముల్లులు చేరుకున్న తర్వాత దీపాలు వెలిగించి కొత్త సంవత్సర నినాదాలు చేసేవారు.ఇలా ఈ చీకట్లో జరగరానివి జరిగాయి. లైటింగ్ లేని టైంలో ఆడవాళ్ల మీద లైంగిక దౌర్జన్యాలు చేశారు. గుంపులు గుంపులుగా మగాళ్లు మృగాళ్లుగా మారి.. ఆడవాళ్లను హింసించారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే నెపంతో అక్కడకు వచ్చిన యువతులను కౌగిలించుకున్న యువకులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిలను వదిలిపెట్టకుండా వాటేసుకొని లైంగిక దౌర్జన్యానికి పాల్పడి గుంపులో కలిసిపోయారు. జరుగుతున్న అరాచకాన్ని పోలీసులు గుర్తించేలోగానే ఆకతాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 12 దాటిన తర్వాత సుమారు 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఈ కీచకపర్వం సాగింది. తర్వాత పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
జరిగిన ఘటనను వివరించిన ఓ ప్రత్యక్ష సాక్షి ఇదొక భారీ హింసగా అభివర్ణించింది. అమ్మాయిలు సాయం కోసం మూకుమ్మడిగా కేకలు వేసినా.. ఎవరూ స్పందించలేదు. పార్టీలో యువకులు చాలా దారుణంగా ప్రవర్తించారు. ప్రతి అమ్మాయిని తాకుతూ.. కౌగిలించుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. చాలామందిని జుట్టు పట్టి ఈడ్చేశారని, కొంత మంది బట్టలు చించేశారని, చివరకు భయంతో పరిగెత్తుతున్నా వదిలిపెట్టలేదని తెలుస్తోంది. ఒక్కరో ఇద్దరో అయితే పోరాడొచ్చు.. కానీ అక్కడ వేల మంది ఉండడంతో ఏం చేయలేకపోయాం అంటూ ఓ ప్రత్యక్ష సాక్షి దీనంగా వెల్లడించింది. అయితే దీని మీద కర్ణాటక హోంమంత్రి స్పందించిన తీరు కూడా చాలా భిన్నంగా ఉంది. ఇలాంటివి క్రిస్ మస్, న్యూఇయర్ వేడుకల్లో చోటుచేసుకోవడం దురదృష్టం అని అన్నారు.